న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా మరో ముందడుగు పడింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో అందరికీ టిక్కెట్లు ఇస్తామని రాజకీయంగా బలోపేతం కావడానికి అన్ని పార్టీల నేతలను తమ పార్టీల్లో చేర్చుకున్న తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలు నెరవేరే సంకేతాలే కనిపిస్తున్నాయి.
అదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సమూలంగా రాజకీయ పరిణామాలే మారిపోనున్నాయి. అధికారంలో ఉన్నందున వారిద్దరూ నియోజకవర్గాలను తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీని ప్రకారం ఇటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీకే రాజకీయంగా మేలు కలుగుతుంది. మరో ఐదేళ్ల పాటు అధికారం కోసం విపక్షాలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్లు పెంచుకోవడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి కేంద్ర న్యాయశాఖ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత ఫైల్కు న్యాయశాఖ ఆమోదముద్ర వేసి హోంశాఖకు పంపినట్లు వినికిడి. ఇప్పటివరకూ అసెంబ్లీ సీట్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 170(3)కి చిన్న సవరణ చేస్తే సరిపోతుందని న్యాయశాఖ పేర్కొన్నట్లు తెలిసింది. ఆ ఆర్టికల్ కింద పొందుపరిచిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వర్తించవని పేర్కొంటూ రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుందని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెంచాలంటే ఆర్టికల్170(3)కి సవరణ చేయాల్సిందేనని గత అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగానే ఇప్పుడు న్యాయశాఖ సవరణలు సూచించినట్లు సమాచారం.