కరోనా వైరస్ వచ్చిన తొలి నాళ్లలో కరోనా వైరస్ సోకిన వారిని వివక్షగా చూసేవారు. ప్రస్తుతం కూడా అవే పరిస్థితులున్నాయి. దీనికి ఉదాహారణ రాజస్థాన్ లో జరిగిన ఓ సంఘటన.రాజస్థాన్లో సెప్టెంబర్ 16న బీఈడీ ఎంట్రన్ టెస్ట్ అయిన పీటెట్ ఎగ్జామ్ నిర్వహించారు. దౌసా జిల్లాలో మొత్తం 80 పరీక్షా కేంద్రాలను ప్రకటించారు. వీటిల్లో ఒకటైన ఆదర్శ్ విద్యా మందిర్లో పరీక్ష రాసేందుకు ఓ అభ్యర్థి అంబులెన్స్లో పరీక్షా కేంద్రానికి వచ్చింది. ఓ యువతి అంబులెన్స్ లో పరీక్షకు రాయడానికి వచ్చిందని తెలిసిన వెంటనే అక్కడ ఉన్న అభ్యర్దులు భయాందోళనకు గురయ్యారు. ఆమె గురించి ఆరా తీయగా కరోనా సోకిందని తెలిసింది. దీంతో ముందుగా ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. కానీ జిల్లా కలెక్టర్ పీయూష్ సమరియా జోక్యంతో ఆమెకు పరీక్షా కేంద్రంలో ప్రత్యేక గదిని కేటాయించారు. దీంతో కరోనా బాధిత యువతి 3 గంటల పాటు పరీక్ష రాసింది. ఆమెకిచ్చిన ఓఎంఆర్ షీటును కూడా అధికారులు ప్రత్యేకంగా ప్యాక్ చేశారు. పరీక్ష రాయగానే ఆమెను అదే అంబులెన్స్లో ఇంటికి తరలించి హోం ఐసోలేషన్లో ఉంచారు. ఆమె పరీక్ష రాసిన గదిని శానిటైజ్ చేశారు.