ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటో ఈ7 ప్లస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 23వ తేదీ లాంచ్ చేయనుంది. అంతేకాకుండా ఈ ఫోన్ మొదటగా బ్రెజిల్లో లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్ సైట్లో లిస్ట్ చేశారు. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్లో దీనికి ఒక ప్రత్యేక పేజీని అందించారు. యూరోప్లో దీని ధరను 149 యూరోలుగా(సుమారు రూ.13,000) నిర్ణయించారు.
మనదేశంలో కూడా దాదాపు ఇదే ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నేవీ బ్లూ, బ్రాంజ్ యాంబర్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర, సేల్ తేదీకి సంబంధించిన వివరాలు సెప్టెంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు తెలియనున్నాయి. ఇందులో 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ కూడా ఇందులో ఉంది. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనకభాగంలో అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్ పై మోటో ఈ7 ప్లస్ పనిచేయనుంది. దీని ర్యామ్ 4 జీబీగానూ, స్టోరేజ్ 64 జీబీగానూ ఉంది. స్టోరేజ్ ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చునని తెలిపారు.
అంతేకాకుండా వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయన్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, మరో 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇక 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని మోటో ఈ7 ప్లస్ సపోర్ట్ చేస్తుంది. 4జీ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.92 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉందని తెలిపారు.