దేశంలో కరోనా విజృంభిస్తున్న ఈ తరణుంలో జరిగిన 74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్డీహెచ్ఎం)ను ప్రధాని ప్రారంభించారు. దీని కింద ప్రతీ భారతీయుడికి ఒక ఐడీ నంబర్ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు.ప్రతీ భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని వెల్లడించారు. ప్రతీ ఒక్కరికీ ఐడీ కార్డు లభిస్తుంది. వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుందని మోదీ తెలిపారు. ఈ ఎన్డీహెచ్ఎం.. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి రానుంది. ఈ పథకం కింద మారుమూల ప్రాంతాలకు కూడా టెలీ మెడిసిన్, ఈ- ఫార్మసీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.