చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుర్చీ అంటే ప్రత్యేక సెంటిమెంట్.. ఏ కారణంగానో తెలియదు కానీ దిల్లీ వెళ్లినప్పుడు కూడా వెంట తన కుర్చీ తీసుకెళ్లేవారామె. ఆ తర్వాత అసలు బయటకు వెళ్లడమే పూర్తిగా తగ్గించేశారు. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాక ఆ కుర్చీని ఎవరూ వాడలేదు. గతంలో ఆమె జైలుకు వెళ్లినప్పుడు, ఇటీవల ఆమె కన్నుమూశాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం ఆమె కార్యాలయాన్ని కానీ, కుర్చీని కానీ వాడలేదు. కేబినెట్ సమావేశాలప్పుడు కూడా ఆ కుర్చీలో అమ్మ ఫొటోను పెట్టేవారే తప్ప తాను కూర్చోలేదు. ఆ చర్యల ద్వారా తాను ఆమె ప్రతినిధిననే ఆయన ప్రకటించేవారు. అయితే ఇప్పటి ముఖ్యమంత్రి పళని స్వామికి అలాంటి సెంటిమెంట్లేమీ లేనట్లున్నాయి.నేడు బాధ్యతలు స్వీకరించిన ఆయన నేరుగా జయలలిత ఆఫీస్కు వెళ్లి ఆమె సీట్లో కూర్చొని ఫైల్స్పై సంతకాలు చేశారు. తర్వాత అధికారులతో మీటింగ్లు నిర్వహించారు. కానీ తనదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. ఆయన తన బల్లపై జయలలిత ఫొటోను ఏర్పాటు చేసుకున్నారు. జయలలిత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై ఆయన దృష్టిపెట్టారు.