పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే ఉపేక్షించేది లేదని వైసీపీ స్పష్టం చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన నాయకుడిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. విశాఖపట్టణానికి చెందిన వైసీపీ నేత కొయ్యా ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ మేరకు వైసీపీ కేంద్రం కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్టణంలో కొయ్యా ప్రసాద్ రెడ్డిపై అనేక ఆరోపణలున్నాయి. రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి పేరును ఉపయోగించి ల్యాండ్ సెటిల్మెంట్స్ పేరుతో అక్రమ కార్యకలాపాలను నిర్వహించారని పార్టీ దృష్టికి వచ్చింది.దీన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ క్రమశిక్షణ సంఘం.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పార్టీలో ఉన్న ఇతర నేతలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకుల పేర్లను ఉపయోగించి ఎవరైనా భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తే ఇలాంటి చర్యలు తప్పవని స్పష్టం చేసింది.