కొద్ది రోజుల్లో తండ్రిని కాబోతున్న ఆనందం. ఇంతలోనే పెను విషాదం. విధి నిర్వహణకే ప్రాముఖ్యత ఇచ్చి నిండు గర్భిణి అయిన భార్యను ఇంటి వద్దే ఉంచి ఆ పైలట్ విధులకు బయలుదేరాడు. ఇంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే కేరళ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇది ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కోపైలట్ అఖిలేశ్ శర్మ విషాదగాధ.
కేరళలోని కోజికోడ్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కో-పైలట్ అఖిలేష్ కుమార్ శర్మ మృతదేహం ఈరోజు ఉదయం యూపీలోని మధురలో గల అతని ఇంటికి చేరుకుంది. ఈ ప్రమాదంలో మరో పైలట్ దీపక్ సాఠె కూడా మృతి చెందారు. కాగా విమాన ప్రమాద వార్త తెలియగానే అఖిలేష్ కుమార్ శర్మ సోదరుడు, అతని బావ కోజికోడ్ వెళ్లారు. అఖిలేష్ శర్మ భార్య తొమ్మిది నెలల గర్భవతి. త్వరలోనే ఆమెకు డెలివరీ జరగనుంది. ఇటువంటి సమయంలో అఖిలేష్ ఇకలేడన్నవార్తను కుటుంబ సభ్యులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్నేహితులు, బంధువులతో అఖిల్ అని ప్రేమగా పిలిపించుకొనే అఖిలేశ్ శర్మకు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు తమ్ముళ్లు, సోదరి ఉన్న అందమైన కుటుంబం ఉంది.
కరోనా కారణంగా అఖిలేష్ లాక్డౌన్కు ముందు ఒకసారి మాత్రమే కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఆయనకు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య మేఘ నిండు గర్భిణి. మరికొన్ని రోజుల్లో వాళ్లింటికి పండంటి బిడ్డ రాబోతుంది. కానీ, ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన అఖిలేశ్ మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత బాధాకర విషయం ఏంటంటే ఇప్పటికీ ఆయన భార్యకు ఆ దుర్వార్తను కుటుంబసభ్యులు తెలియనివ్వలేదు. కాగా, కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్కు బయలుదేరిన బృందానికి మే 8, 2020న కొలికోడ్లోని విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. అ బృందంలో అఖిలేశ్ కూడా ఉన్నారు. కానీ సరిగ్గా మూడు నెలల తరవాత ఆగస్టు 7న అదే చోట ఆయన విగతజీవిగా మారడం బాధాకరం. చివరికి కన్నబిడ్డను చూడకుండానే అఖిలేష్ కన్నుమూయడం అందర్నీ కలచివేస్తోంది.