అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : అభివృద్ధి చేసే ప్రభుత్వానికే అన్ని విధాలా మద్దతు ఇవ్వాల్సిన అవసరం వుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తాను కార్యకర్తలతో అన్న మాటలను ఒక వర్గం మీడియా వక్రీకరించినదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి కర్నూలు సభలో తన ప్రసంగంపై దుమారం రేపడాన్ని ప్రస్తావించారు. పని చేసే ప్రభుత్వానికే ప్రజలు ఓటేయాలనేది తన వ్యాఖ్యల ఉద్దేశమని వివరించారు. అయోగ్యులకు ఓటు వేస్తే రాష్ట్ర అభివృద్ధి తలకిందులవుతుందని, ఎన్నికల్లో డబ్బుకు ఆశపడి ఓట్లు వేయొద్దనేది తన అంతరార్థమని అన్నారు. తన వ్యాఖ్యలను ఒక వర్గం పత్రికలు, న్యూస్ ఛానళ్లు వక్రీకరించి తప్పుడు అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. వాస్తవానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమం, అభివఎద్ధి కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. పోలవరం, అమరావతి వంటి మహోన్నత నిర్మాణాలను భుజానికెత్తుకున్న ప్రభుత్వానికి అండదండగా ఉండాల్సిన మీడియా ఒకవర్గం ప్రయోజనలాకు కొమ్ముకాసేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. మంచి చేసే ప్రభుత్వాలను ప్రోత్సహిస్తే మరిన్ని మంచి ప్రయోజనాలు చేయడానికి వీలవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. తమ రాతలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ ఒక వర్గం మీడియా నడుచుకోవడం బాధాకరమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తోందని అన్నారు. పెన్షన్లను ఐదురెట్లు పెంచడం, 24 గంటల విద్యుత్ అందించడం వంటి ప్రభుత్వ విజయాల్లో కొన్నింటినైనా మీడియా గుర్తించాలని కోరారు. విభజన తరువాత రాష్ర్టం వున్న ఆర్థిక పరిస్థితులలో ఇంత పెద్దఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, అమలుచేయడం మరెవ్వరూ కూడా చేయడానికి సాహసించరని, ఒక స్పష్టమైన విజన్తో ధైర్యంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. నోట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూసే రాజకీయ పక్షాల ఆటకట్టించాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై ఒక వర్గం మీడియా కక్ష పూరితంగా దుష్ప్రచారం చేస్తోందని పార్టీ నేతలు ముఖ్యమంత్రి దగ్గర అభిప్రాయం వ్యక్తం చేశారు.