ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతున్న విషయం తెలిసిందే. కరోనాను నివారించేందుకు వ్యాక్సిన్,మందును తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు,అనేక ఫార్మా కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) పలు మందుల ప్రయోగాలకు అనుమతి ఇచ్చింది. తాజాగా డీసీజీఐ మరో శుభవార్త చెప్పిందని "టైమ్స్ నౌ న్యూస్" కథనం ఆధారంగా తెలుస్తోంది. కరోనా పేషెంట్లకు అత్యవసర సమయంలో వాడేందుకు ఇటోలిజుమాబ్ (Itolizumab) అనే ఇంజెక్షన్ మందుకు అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మందును చర్మ వ్యాధి ఐన సొరియాసిస్ ను తగ్గించేందుకు వాడుతున్నారు. బెంగళూరులోని బయోకాన్ బయో ఇండియా లిమిటెడ్ చాలా ఏళ్ల కిందే సొరియాసిస్ పేషంట్లకు వాడేందుకు అనుమతి పొందింది.ఇప్పుడు అదే మందు కరోనాకీ కూడా పని చేస్తుందని గుర్తించారు. ఈ మందు కరోనా పేషంట్లందరికి ఇవ్వరు. ఈ మందు చాలా పవర్ ఫుల్ కావడంతో కరోనాతో పరిస్థితి చేజారి సీరియస్ గా ఉన్న వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఎయిమ్స్ కు చెందిన కొంత మంది ప్రతినిధులు ఈ వ్యాక్సిన్ తో కరోనా పేషంట్ల పై ప్రయోగాలు కూడా చేశారు. కరోనా అంతు చూసే యాంటీబాడీల ఉత్పత్తికి కృషి చేసే సైటోకిన్లను ఉత్పత్తి చేయడంలో ఇది బాగా పనిచేస్తోందని వారు గుర్తించారు.ఇటోలిజుమాబ్ని మే నెలలో ముంబైలోని నాయిర్ హాస్పిటల్ కరోనా రోగుల పై వాడి చూసింది. వెంటిలేటర్ పై ఉన్న ఇద్దరు రోగులకు ఇచ్చింది. వాళ్లు కోలుకొని సాధారణ స్థితికి వచ్చారు. ఈ మందు చాలా వరకూ ఒక డోస్ ఇవ్వగానే రోగులు కోలుకుంటున్నారు. కొంత మందికి మాత్రం 3 డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా పేషంట్లకు రెమ్డెసివిర్,ఫవిపిరవిర్ మందులను వాడుతున్నారు. డాక్టర్లు కరోనా పేషంట్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని వాడొచ్చని ఐసీఎంఆర్ ఇది వరకే ప్రకటించింది. ఇది కరోనా మరణాలను ఆపలేకపోతుందన్న వాదనలు ఉన్నాయి. ఇటోలిజుమాబ్ బాగా పని చేస్తే అది కరోనా పేషంట్లకు దివ్య ఔషధంలా పని చేస్తుందని చెప్పవచ్చు.