ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

national |  Suryaa Desk  | Published : Thu, Jun 04, 2020, 10:30 AM

దేశంలోని రైతులకు ఇది చరిత్రాత్మకమైన రోజు. నేడు జరిగిన కేబినెట్ మీటింగ్ లో కేంద్రం రైతుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇకపై తాము పండించిన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లోనూ అమ్ముకునే విధంగా చట్టంలో మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు నిత్యావసర వస్తువుల చట్టం 1955కు సంబంధించిన పలు కీలక సవరణలను ఆమోదించింది.దేశంలోని రైతులకు ఇది చరిత్రాత్మకమైన రోజని, దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ... రైతులకు మాత్రం ఈ రోజే వచ్చిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. స్థానికంగా ఉండే వారు కొనుగోలు చేయకపోతే... తమ ఉత్పత్తులను ఏదో ఒక ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇప్పటివరకు ఉండేదని అన్నారు.ధరల విషయంలో ఇంతకాలం వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ నిర్ణయం ద్వారా రైతులకు మాత్రమే కాదు... వ్యవసాయ రంగానికే లాభం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్థానిక మార్కెట్ కమిటీలు రైతులకు మంచి ధర రావడానికి అడ్డంకిగా మారాయి. బయట అమ్ముకుంటే మంచి ధర వచ్చే అవకాశం ఉన్నా... కేవలం లైసెన్స్ ఉన్న దళారీలకు మాత్రమే తమ వస్తువులను అమ్ముకునేలా చేశాయి. అయితే ఈ కొత్త చట్టం కారణంగా రైతులు ఇతర రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించే వీలు కలుగుతుంది. యూపీ రైతులు ఈ ట్రెడింగ్ ద్వారా గుజరాత్‌లోనూ తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. భారత్ ఒకే దేశం, ఒకే మార్కెట్ దశకు చేరుకుంటోందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com