మీరు బ్యాంకులో డబ్బులు దాచుకున్నారా? పోస్ట్ ఆఫీస్ పథకాల్లో సేవింగ్స్ చేస్తున్నారా? సుకన్య సమృద్ధి యోజన-SSY, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-పిపిఎఫ్ లాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం చిన్నమొత్తాల పొదుపు పథకాలపై భారీగా వడ్డీ తగ్గించింది. 70 నుంచి 140 బేసిస్ పాయింట్స్ తగ్గించింది కేంద్రం. అంటే 70 పైసల నుంచి 140 పైసల వరకు వడ్డీ తక్కువగా లభిస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తగ్గించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్బీఐ ఇటీవల రెపోరేట్ భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఏకంగా 75 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ తగ్గించింది. దీంతో బ్యాంకులు అన్ని రకాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ రేట్ల కన్నా చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చాలాకాలంగా అన్ని బ్యాంకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాయి. రెపో రేట్కు, చిన్న మొత్తాల పథకాలపై ఉన్న వడ్డీ రేట్లకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలని డిమాండ్ చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుత వడ్డీ రేట్లు చూస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్పై ఏకంగా 80 బేసిస్ పాయింట్స్ అంటే 7.9 శాతం నుంచి 7.1 శాతానికి వడ్డీ తగ్గింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్పై 110 బేసిస్ పాయింట్స్ అంటే 7.9 శాతం నుంచి 6.8 శాతానికి వడ్డీ తగ్గింది. కిసాన్ వికాస్ పత్రపై 70 బేసిస్ పాయింట్స్ అంటే 7.6 శాతం నుంచి 6.9 శాతానికి వడ్డీ తగ్గింది. 5 ఏళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్పై ఏకంగా 120 బేసిస్ పాయింట్స్ అంటే 8.6 శాతం నుంచి 7.4 శాతానికి వడ్డీ తగ్గింది. సేవింగ్స్ డిపాజిట్స్పై వడ్డీ ఏడాదికి 4 శాతంలో ఎలాంటి మార్పు లేదు. సుకన్య సమృద్ధి యోజనపై 80 బేసిస్ పాయింట్స్ అంటే 8.4 శాతం నుంచి 7.6 శాతానికి వడ్డీ తగ్గింది. 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్లపై 140 బేసిస్ పాయింట్స్ అంటే 7.2 శాతం నుంచి 5.8 శాతానికి వడ్డీ తగ్గింది. 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ 7.7 శాతం నుంచి 6.7 శాతానికి, మూడేళ్ల డిపాజిట్ వడ్డీ 6.9 శాతం నుంచి 5.5 శాతానికి వడ్డీ తగ్గింది. సాధారణంగా చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఒకేసారి ఇంత భారీ స్థాయిలో వడ్డీ రేట్లు తగ్గించడం ఇదే మొదటిసారి.