నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఓ గ్రామంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా కర్నూలు జిల్లా జూపాడు మండలం బన్నూరులో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దీంతో ఆయన పర్యటన పట్ల గ్రామస్తులు, వైసీపీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చింది.
ఈ సందర్భంగా ఆర్థర్ మాట్లాడుతూ... ఇకపై తాను గ్రామానికి రానని పనులు కావాలంటే తన వద్దకే రావాలని వ్యాఖ్యానించారు. తాను ఎవరి కాళ్లూ పట్టుకోనని, అయితే, తన వద్దకు ఎవరు వచ్చినా పనిచేసి పెడతానని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగి తాము ఆర్థర్ ను గెలిపించామని కార్యకర్తలు అన్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఆయన గ్రామానికి ఎలా వస్తారని కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో తాను ఇంకోసారి ఓట్లు అడుక్కోనంటూ ఆర్థర్ వ్యాఖ్యానించారు.