హైదరాబాద్: బ్యాట్స్మన్లు అందరూ పెవిలియన్కు వరుస కట్టిన తరుణంలో అతడు ఎదురొడ్డినిలిచాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొని తన టీమ్కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అతడే ముంబై ఇండియన్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా. ఆదివారం రాత్రి రైజింగ్ పుణే సూపర్ జెయింట్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కృనాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ముంబై ఆటగాళ్లలో అతడిదే టాప్ స్కోరు. కృనాల్ సమయోచిత బ్యాటింగ్కు తోడు బౌలర్ల ప్రతిభ తోడవడంతో ముంబై ఐపీఎల్-10 విజేతగా నిలిచింది.
జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించిన కృనాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీమిండియాలో చోటుదక్కించుకోకుండా ఐపీఎల్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్న మొదటి ఆటగాడిగా అతడు గుర్తింపు పొందాడు. ఇంతకుముందు ఐపీఎల్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నవాళ్లందరూ టీమిండియా తరపునవారే కావడం విశేషం. రెండుసార్లు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఈ అవార్డు అందుకున్నారు.