టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 47.5 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసి విజయ భేరి మోగించింది. ఓపెనర్ షై హోప్ (151 బంతుల్లో 102 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ చేయగా స్టార్ ఆటగాడు షిమ్రోన్ హెట్మెయిర్ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్తో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్. చెపాక్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా విండీస్ జరిమానాకు గురైంది. నిర్ణీత సమయంలో విండీస్ నాలుగు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడప్పుడు ఏదైనా మ్యాచ్లో ఒకటి లేదా రెండు ఓవర్లు తక్కువగా వేయడం సాధారణమే కానీ, కీరన్ పొలార్డ్ టీమ్ మాత్రం ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేయడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మినిమమ్ ఓవర్ రేట్ ఉల్లంఘన కింద ఒక్కో ఓవర్కు తుది జట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తారు. నాలుగు ఓవర్లకు కలిపి ఒక్కో ఆటగాడి మ్యాచ్ ఫీజులో మ్యాచ్ రిఫరీ ఏకంగా 80శాతం జరిమానా వేశారు. మ్యాచ్ అనంతరం రిఫరీ ముందు కరీబియన్ టీమ్ కెప్టెన్ పొలార్డ్ ఉల్లంఘనను ఒప్పుకోవడంతో పాటు రిఫరీ విధించిన జరిమానాను అంగీకరించాడు.