ఆగ్నేయ దిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులు, స్థానికులు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి, ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో 60 మంది గాయపడ్డారు. జామియా ఘటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా ఇండియా గేట్ వద్ద ధర్నాకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆమె సంఘీభావం తెలిపారు. దేశంలోని విద్యార్థులు, వారి హక్కులపై ప్రభుత్వం దాడి చేస్తోందని కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. అందుకే ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు సీనియర్ నేతలు రెండు గంటల పాటు ఇండియా గేట్ వద్ద ధర్నాకు దిగి తమ నిరసన తెలియజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ధర్నాలో ప్రియాంకతో పాటు కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఏకే ఆంథోని, పీఎల్ పునియా, అహ్మద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.