8 సిక్సులు, 183.05 స్ట్రయిక్ రేట్.. యావరేజి 54. బంగ్లాదేశ్తో ఇటీవలే ముగిసిన మూడు టీ20ల సిరిస్లో శ్రేయాస్ అయ్యర్ నెలకొల్పిన గణాంకాలు. ఈ సిరిస్లో ఇరు జట్ల బ్యాట్స్మెన్లలో అయ్యర్దే అత్యధిక స్ట్రయిక్ రేట్. అయితే, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరుగులన్నీ కూడా అతడు NO.4 స్థానంలో చేసినవే. NO.4 స్థానం గురించి ఎందుకని ప్రత్యేకంగా ప్రస్తావించానంటే... ఈ స్థానం గత కొద్దికాలంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను వేధిస్తోన్న ప్రధాన సమస్య. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్ కోసం ఎంతో మందిని ఈ స్థానం కోసం పరీక్షించినప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు మాత్రం దొరకలేదు. చివరకు వరల్డ్కప్లో విజయ్ శంకర్తో టీమిండియా బరిలోకి దిగింది. దీంతో మెగా టోర్నీలో అతడి ప్రధర్శన అంతంత మాత్రంగానే ఉండటం విశేషం. చివరకు గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. అయితే, తాజా బంగ్లాదేశ్ పర్యటనను చూస్తే ఎట్టకేలకు ఆ స్థానంలో ఆడే ఆటగాడు దొరికినట్లే కనిపిస్తున్నాడు. అతడెవరో కాదు శ్రేయస్ అయ్యర్. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రాణిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా వన్డేల్లో, సొంతగడ్డపై బంగ్లాదేశ్తో ముగిసిన మూడు టీ20ల్లో అయ్యర్ అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహారించాడు. అయ్యర్ స్పెషాలిటీ ఏంటంటే పరిస్థితులకు తగినట్లు తన ఆటతీరు మార్చుకోవడం. నాగ్పూర్ వేదికగా బంగ్లాతో చివరి టీ20లో 35 పరుగులకే 2 వికెట్లు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అయ్యర్ తొలుత నెమ్మదిగా ఆడి ఆ తర్వాత స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో అయ్యర్ 62 పరుగులతో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.తొలుత కేఎల్ రాహుల్తో కలిసి మూడో వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అయ్యర్ ఆ తర్వాత పంత్తో కలిసి నాలుగో వికెట్కు 45 పరుగులు జోడించాడు. తొలి టీ20లోనూ ధావన్తో కలిసి శ్రేయాస్ అయ్యర్ (34) పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక, రెండో టీ20లో రోహిత్ ఔటైన తర్వాత 125/2తో ఉన్న దశలో క్రీజులోకి వచ్చి అయ్యర్ (24 నాటౌట్) జట్టుకు విజాయన్ని అందించాడు. ఇలా బంగ్లాతో సిరీస్లో ఆకట్టుకున్నాడు. అయితే, నాలుగో స్థానంలో తాను రాణించడానికి జట్టు మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రోత్సాహామేనని అయ్యర్ చెప్పుకొచ్చాడు.