శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి సత్తా చాటింది. 7 దేశాలకు లబ్ధి చేకూర్చే ప్రతిష్ఠాత్మక దక్షిణాసియా ఉపగ్రహం జీశాట్-9ను ప్రయోగించింది. జీఎస్ఎల్వీ-ఎఫ్09 వాహకనౌక ద్వారా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి 28గంటల కౌంట్డౌన్ ప్రక్రియ అనంతరం జీశాట్-9 నింగిలోకి దూసుకెళ్లింది.2230 కిలోల బరువైన ఈ సమాచార ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.235కోట్లు ఖర్చు చేసింది. మొత్తం ఈ ప్రాజెక్టుకు రూ.450కోట్లు వెచ్చించింది. 12 ఏళ్లు పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. ఈ ఉపగ్రహం ద్వారా భారత్ సహా దక్షిణాసియా దేశాలైన ఆఫ్గానిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు లబ్ధి పొందనున్నాయి.