హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల ప్రముఖ నేతలంతా తుదిదశ ప్రచారాల బాట పట్టారు. నేడు మహారాష్ట్ర, హర్యానాలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. హర్యానాలోని మొహానా, హిసర్ బహిరంగ సభల్లో ప్రధాని, మహారాష్ట్రలోని అహేరీ, రాజురా, వాని, ఖాసర్ఖెడా ర్యాలీల్లో అమిత్షా, హర్యానాలోని మహేంద్రగఢ్ బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.