కోడిపందెం కేసులో ఓ ఎక్సైజ్ సీఐ, ఆయన వాహన డ్రైవర్కు నెలరోజుల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరు సెకెండ్ క్లాస్ మేజిస్ర్టేట్ రాజేంద్ర తీర్పునిచ్చారు. సోమవారం బంగారుపాళ్యం పోలీసు స్టేషన్లో ఎస్ఐ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట వద్ద ఉన్న ఓ మామిడి తోటలో కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు ఈ ఏడాది జనవరి 13వతేదీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్పట్లో ఎస్ఐగా ఉన్న అనిల్కుమార్ సిబ్బందితో కలసి ఆ ప్రాంతంలో దాడులు జరిపారు. ఇందులో భాగంగా 54 మంది జూదరులను అదుపులోకి తీసుకుని 57 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరచగా, 52 మంది నేరం అంగీకరించి జరిమానా చెల్లించారు. కాగా, పట్టుబడిన వారిలో పలమనేరు ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని ఇంటర్స్టేట్ నిఘా విభాగంలో సీఐగా పనిచేస్తున్న మోహన్, ఆయన కారు డ్రైవర్ రాజా ఉన్నారు. దీంతో తాము కోడిపందేలు ఆడటం లేదని వీరిద్దరు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అయితే తాము దాడులు చేసిన సమయంలో సీఐ, ఆయన కారు డ్రైవర్ ఘటనా స్థలంలోనే ఉన్నట్లు పోలీసులు కోర్టుకు ఆధారాలను సమర్పించారు. ఏపీపీ కృష్ణారెడ్డి వాదనల మేరకు వీరిద్దరి నేరం రుజువయింది. ఆ మేరకు మోహన్, రాజాకు నెలరోజుల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సోమవారం చిత్తూరు సెకెండ్ క్లాస్ మేజిస్ర్టేట్ రాజేంద్ర తీర్పునిచ్చిట్లు ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. కాగా, ఈ తీర్పుపై సీఐ మోహన్ పైకోర్టుకు అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిసింది.