మార్నింగ్ వాక్ కోసం బయల్దేరిన వారికి నడిరోడ్డుపై మొసలి కనిపించింది. ఊహించని ఈ పరిణామానికి పాదచారులు హడలిపోయారు. అటవీశాఖ అధికారులు రంగప్రవేశం చేసి మొసలిని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్లో చోటుచేసుకుందీ సంఘటన. స్థానికుల కథనం మేరకు.. శుక్రవారం ఉదయం నయాగంజ్ ప్రాంతంలో ఓ మొసలి దర్శనమిచ్చింది. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన వారు రోడ్డుపై మొసలిని చూడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులకు సంప్రదించారు. దీంతో హుటాహుటిన అటవీ సిబ్బంది అక్కడికి చేరుకున్న మొసలిసి పట్టుకుని ఓ నదిలో సురక్షితంగా వదిలిపెట్టారు. మొసలిని ఓ తాడుతో కట్టివేసిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.