నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శరద్ పవార్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఘటన చెప్పుకుని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుందని ఆరోపించారు. ఈ ఘటన ఆధారంగా ప్రజల్లో బీజేపీకి అనుకూలమైన భావనలు తీసుకువచ్చారన్నారు. మహారాష్ట్రలో నడుస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇలానే అధికారంలోకి వచ్చిందన్నారు.
'సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు ప్రజలంతా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కోపంతో ఉన్నారు. ఎప్పుడు అయితే పుల్వామా ఘటన జరిగిందో.. సీఆర్పీఎఫ్ ఘటనలో జవాన్లు వీర మరణం పొందిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఆ ఘటనతో ప్రజల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇదొక్కటి చాలు ఫడ్నవీస్ ఏ మాత్రం పనిచేయకుండా అధికారంలోకి వచ్చేశారు' అని శరద్ పవార్ విమర్శించారు.
ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు 'అధికారంలోకి వచ్చేందుకు పలు పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. బహుజన్ వికాస్ అఘాడీ, సమాజ్ వాదీ పార్టీలతో పాటు పలు పార్టీలతో కలిసి పనిచేస్తాం' అని అన్నారు. ఇటీవలే శరద్ పవార్ జమ్మూ కశ్మీర్ పర్యటన పూర్తి చేసుకుని అక్కడి పరిస్థితులపై మాట్లాడారు. తనకు పాకిస్తాన్ అంటే ఇష్టమని చెప్పడంతో మోడీ నుంచి కౌంటర్లు ఎదుర్కోవలసి వచ్చింది.