ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణ్ జైట్లీ ఇక లేరు.. చికిత్స పొందుతూ..

national |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2019, 01:03 PM

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 9న ఆసుపత్రిలో చేరిన అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం 12.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీనికి సంబంధించిన ఎయిమ్స్ వర్గాలు మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేశాయి.


అరుణ్ జైట్లీ 1952లో డిసెంబర్ 28న మహరాజ్ కిషన్ జైట్లీ, రత్నప్రభ దంపతులకు ఢిల్లీలో జన్మించారు. తండ్రి న్యాయవాది కావడంతో జైట్లీ కూడా కామర్స్‌లో హానర్స్ డిగ్రీ చేశారు. అనంతరం 1977లో ఢిల్లీలోని లా యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారత విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. ఎమర్జెన్సీ టైమ్‌లో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ)లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన టైమ్‌లో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా మంత్రిగా పనిచేశారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడంతో అరుణ్ జైట్లీని రాజ్యసభ సభ్యుడిని చేసి ఆర్థికమంత్రి పదవిని అప్పగించారు. అయితే 2019 ఎన్నికల్లో అరుణ్ జైట్లీ పోటీ నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా మంత్రి పదవిని కూడా త్యజించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com