కాళ్లపారాణి కూడా ఆరక ముందే నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లైన మరుసటి రోజే ఆత్మహత్య చేసుకోవటం స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన ఎం.కళ్యాణి(20)కి సోమవారం చందర్లపాడు మండలం కొడవటికల్లుకు చెందిన ఏసోబుతో వివాహమైంది. అదేరోజు అత్తగారింటికి వెళ్లిన ఆమె మంగళవారం భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. మధ్యాహ్నం ఇంటిలో ఫ్యానుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పైళ్లైన మరుసటి రోజే ఆత్మహత్య చేసుకోవటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తండ్రి రామయ్య కడుపు నొప్పి తాళలేక కూతురు ఆత్మహత్య చేసుకుందని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రామగణేష్ మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.