అమరావతి: రైతుల వద్ద మిగిలిన ఎండు మిర్చికి ఆర్థిక సాయం అందించేందుకు వివరాల సేకరణ శుక్రవారం ప్రారంభమవుతోంది. ఏ రైతు వద్ద ఎంత మిర్చి మిగిలిందన్న వివరాలను సేకరించేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సిబ్బంది శుక్రవారం నుంచి ప్రతి వూరిని సందర్శించనున్నారు. రైతుల ఇళ్లు, కొష్టాలు, కళ్లాల్లోని మిర్చి ఎంత ఉందన్నది సేకరిస్తారు. రైతుల వద్ద సుమారు 12లక్షల క్వింటాళ్ల మిర్చి ఉందని మార్కెటింగ్ శాఖ అంచనా. వివరాల సేకరణ పూర్తయ్యాక క్వింటా రూ.1,500 చొప్పున ప్రతి రైతుకు గరిష్ఠంగా 20 క్వింటాళ్లకు ప్రభుత్వం ఆర్థికసాయం నేరుగా అందిస్తుంది. మిరప రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి ఆర్థికసాయం లభించటంలో జాప్యమైనా.. ఇబ్బందిలేకుండా ముందుగా ప్రభుత్వమే నిధులను సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గురువారం రాత్రి ‘ఈనాడు’కు తెలిపారు. కేంద్ర సాయంపై చర్చించేందుకు దిల్లీకి వెళ్లిన వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ బృందం కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శితో భేటీ అయింది. సాయం చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం లభించినా.. విధివిధానాలు ఖరారు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు అందుబాటులో లేక మంగళవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.