భారత మహిళా క్రికెటర్ స్మృతి మంథాన, టెన్నిస్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్నలు అర్జున అవార్డులు అందుకున్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రెజిజు చేతుల మీదుగా అర్జున అవార్డులు అందుకున్నారు. గతంలో జరిగిన అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేకపోవడంతో వీరిద్దరు ఇప్పుడు అవార్డులు స్వీకరించారు.గత సంవత్సరం ప్రఖ్యాత అర్జున అవార్డు కోసం 20మంది ఆటగాళ్ల పేర్లను ప్రతిపాదించారు. ఈ లిస్టులో స్మృతి మంథాన, రోహన్ బోపన్నలు కూడా ఉన్నారు. నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), హిమదాస్ (అథ్లెటిక్స్), ఎన్ సిక్కిరెడ్డి బాడ్మింటన్)లు కూడా అర్జున అవార్డు అందుకున్నారు. ఇక ప్రతిష్టాత్మక రాజీవ్గాంధీ ఖేల్ రత్న అవార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రపంచ చాంపియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులు గెలుచుకున్నారు.
అవార్డు ప్రధానోత్సవం అనంతరం మంథాన మాట్లాడుతూ... 'నేను మరియు కోచ్ రామన్ సర్ నా ఆట గురించి చర్చించాం. టి20 క్రికెట్లో స్థిరంగా ఎలా ఆడాలో సూచించారు. నా ఆటను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది' అని అన్నారు. 22 ఏళ్ల మంథాన వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉంది. సెప్టెంబర్లో దక్షిణాఫ్రికా సిరీస్ సమీపిస్తున్న తరుణంలో ఆ సిరీస్ కోసం మంథాన ఎదురుచూస్తోంది.'కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రెజిజు చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా' అని బొప్పన్న తెలిపారు. 'ప్రపంచంలోని అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరైన మంథాన, ఆసియా గేమ్స్ బంగారు పతక విజేత బొప్పనలకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డులను ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలోని అవార్డుల ప్రధానోత్సవ సందర్భంగా ఇద్దరు అందుబాటులో లేకపోవడంతో అవార్డులను అందుకోలేదు' అని క్రీడాశాఖ మంత్రి తెలిపారు.