హైదరాబాద్ : గుజరాత్లోని సూరత్లో శుక్రవారం సాయంత్రం ఓ కోచింగ్ సెంటర్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. కోచింగ్ సెంటర్ యజమాని నిర్లక్ష్యం వల్లే భారీగా ప్రాణ నష్టం జరిగిందని ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. కోచింగ్ సెంటర్లో కుర్చీల స్థానంలో టైర్లను ఏర్పాటు చేశారని.. దీంతో మంటలు వేగంగా వ్యాపించి ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని గుజరాత్ సీఎస్ జేఎన్ సింగ్ స్పష్టం చేశారు. ఇక కోచింగ్ సెంటర్ చుట్టుపక్కలతో పాటు పై భాగాన్ని ఫ్లెక్సీలతో కప్పడం కూడా భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందన్నారు. దీని వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని ఆయన తెలిపారు. ఈ కేసులో కోచింగ్ సెంటర్ యజమాని భార్గవ్ భూటానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ భవనాన్ని నిర్మించిన ఇద్దరు బిల్డర్లు హర్షుల్ వెకారియా, జిగ్నేశ్ పలివాల్ పరారీలో ఉన్నారు