బెంగళూరు: టీడీపీ అధినేత చంద్రబాబుకు కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి ఊహించని షాకిచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కుమారస్వామి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఢిల్లీలో ఈవీఎంల అంశంపై చర్చించేందుకు విపక్షాలు సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఐతే, ఈసీ వద్ద నిరసన కార్యక్రమానికి కుమారస్వామి దూరంగా ఉంటారని జేడీఎస్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటనకు కుమారస్వామి వెళ్లడంలేదని ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వెల్లడించింది. చంద్రబాబు ఈసీపై పదేపదే ఆరోపణలు చేస్తూ దుప్ప్రచారానికి దిగుతుండటంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్డీయేతర నేతలు ఈసీని కలవనున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ధోరణిపై విపక్ష నేతలు చర్చించనున్నారు. నేడు ఎన్డీయే మిత్రపక్షాల సమావేశాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలోని అశోకా హోటల్లో ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత పరిణామాలు, ఎగ్జిట్పోల్స్, ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.