కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో ఎయిర్పోర్టు వద్ద ఆదివారం అర్ధరాత్రి ఐఈడీ బాంబును పోలీసులు గుర్తించారు. ఎయిర్పోర్టుకు వెళ్తున్న దారిలో రోడ్డుపక్కన బాంబు ఉండడాన్ని గమనించిన పోలీసులు.. అనంతరం దాన్ని నిర్వీర్యం చేశారు. శ్రీలంక ఎయిర్ఫోర్స్ అధికార ప్రతినిధి గిహన్ సెనివిరత్నే మాట్లాడుతూ.. ఈ ఐఈడీ బాంబును స్థానికంగానే తయారు చేశారని, ఆరు ఫీట్ల పొడవున్న పైపులో బాంబును అమర్చారని ఆయన పేర్కొన్నారు. దీన్ని పోలీసులు ముందే గమనించడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ బాంబును జాగ్రత్తగా నిర్వీర్యం చేశామన్నారు. శ్రీలంకలో ఆదివారం ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు వరుసగా ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల ధాటికి వందల సంఖ్యలో మృతి చెందారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 290కి చేరుకోగా, వివిధ ఆస్పత్రుల్లో 600 మంది చికిత్స పొందుతున్నారు. ఈ వరుస పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు 24 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.