మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను ఇవాళ మరోసారి ప్రశ్నించింది. న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో వాద్రాను మూడున్నర గంటల పాటు విచారించింది. తన ఆరోగ్యం బాగా లేదని వాద్రా చెప్పడంతో మూడున్నర గంటల పాటే ప్రశ్నించగలిగామని ఈడీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తిరిగి ఫిబ్రవరి 22 ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని ఆయనకు సూచించినట్టు చెప్పారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త అయిన రాబర్ట్ వాద్రా ఢిల్లీ ఈడీ ఎదుట హాజరు కావడం ఇది నాలుగోసారి. కేంద్ర ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వాద్రా ఉదయం 10.30 గంటలకు వచ్చారు. ఆయనను మధ్యాహ్నం 2 గంటల వరకు ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించారు. ఈడీ కార్యాలయం బయట వందలాదిగా గుమికూడిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతకు ముందు ఈడీ వాద్రాను ఫిబ్రవరి 6,7,9 తేదీల్లో ప్రశ్నించింది. విదేశాల్లోని 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ప్రకటించని ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ ఆస్తులన్నీ వాద్రావేనని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 16న ఢిల్లీ కోర్టు వాద్రా తాత్కాలిక బెయిల్ ను మార్చి 2 వరకు పొడిగించింది.