అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై ఈ నెల 26 నుంచి సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 29 నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వినాల్సి ఉంది. అయితే న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఎస్ఏ బోబ్డే సెలవుపై వెళ్లడంతో విచారణ వాయిదా పడింది. ప్రస్తుతం జస్టిస్ బోబ్డే సెలవు నుంచి తిరిగి రావడంతో ఫిబ్రవరి 26 నుంచి కేసు విచారణ ప్రారంభం కానుంది.
2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.