విశాఖపట్నంలోని యూనిట్-2లో దివీస్ ల్యాబొరేటరీస్ ఉత్పత్తి చేస్తున్న ఔషధాల దిగుమతులపై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు భారీగా కుదుపులకు లోనయ్యాయి. ఔషధ ఎగుమతులపై అమెరికా డ్రగ్ ఏజెన్సీ 66-40 హెచ్చరికల ప్రభావం పడనుండటంతో దివీస్ షేర్ల ధరలు 20 శాతం పతనమయ్యాయి. లెవిటిరాసెటమ్, నాప్రోక్సెన్ సోడియం, క్లోరోఫ్యురైన్ తదితర పది రకాల ఔషధాలకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ మినహాయింపు ఇచ్చిందని దివీస్ ల్యాబొరేటరీస్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలిపింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అభ్యంతరాల నేపథ్యంలో తిరిగి ఎఫ్డీఏ సమ్మతి పొందడం కోసం థర్డ్ పార్టీ కన్సల్టెన్సీలతో కలిసి దివీస్ ప్రయత్నాలు ప్రారంభించింది. యూఎస్ఎఫ్డీఏ ఆంక్షల ప్రభావం నేపథ్యంలో దివీస్ షేర్లు 19.69 శాతం నష్టపోవడంతోపాటు ఏడాది కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో ఆ సంస్థ షేర్ల విలువ రూ. 635కు చేరింది. ఆ సంస్థ అమ్మకాల్లో 60-65 శాతం, అమెరికాకు ఎగుమతి అవుతున్న ఔషధాల్లో 20 శాతానికిపైగా వాటా ఈ ప్లాంట్దే. దీంతో ఎఫ్డీఏ హెచ్చరికల ప్రభావం దివీస్పై తీవ్రంగా పడింది.