ఢిల్లీ: ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి పునరుద్ఘాటించారు. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె చెప్పారు. ఈవీఎంల టాంపరింగ్ జరిగిన విషయం యూపీ ప్రజలకు కూడా తెలుసన్నారు. అలహాబాద్లో మహమ్మద్ సమీ అనే బీఎస్పీ నేత హత్యకు గురైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో సమాజ్వాదీ ప్రభుత్వం ఉన్నా.. భాజపా ప్రభుత్వం ఉన్నా పెద్దగా తేడా లేదన్నారు... రెండు ప్రభుత్వాలు శాంతి భద్రతలను నియంత్రించలేకపోతున్నాయని ఆమె ఆరోపించారు. నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన యోగి ఆదిత్యనాథ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేయబోతున్నారని మాయావతి వ్యాఖ్యానించారు.