28వ తేదీన కలెక్టర్ల సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ల సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుతో పాటు వ్యవసాయం, కనీస మద్దతు ధర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, రాష్ట్రంలో అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవ సహా ఇతర ఆరోగ్య పథకాలపై చర్చించనున్నారు. వాటితో పాటు జన్మభూమితో పాటు వివిధ గ్రీవెన్స్ ల ద్వారా అందిన రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, 22ఏ చుక్కల భూములు, అన్ని రకాల భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, ముఖ్యమంత్రి యువ నేస్తం పథకాల ప్రగతి, ఇళ్ల నిర్మాణాలపైనా, అంగన్వాడీకేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుతెన్నులపైనా ఈ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్లు ఆ ప్రకటనలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు.