ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్ర తుఫానుగా తీరం దాటనున్న ‘రెమల్’.. అక్కడ పెను విధ్వంసమే: ఐఎండీ హెచ్చరిక

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 10:48 PM

నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారిందని, శనివారం సాయంత్రానికి ఇది తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతున్న తుఫాను.. పశ్చిమ్ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్‌కు 380 కిలోమీటర్లు.. బంగ్లాదేశ్‌కు నైరుతి దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. అది తుఫానుగా మారి ఉత్తరదిశగా కదలి సాయంత్రానికి మరింత బలపడనుందని ఐఎండీ వెల్లడించింది. మే 26 అర్థరాత్రి మరింత ఉగ్రరూపం దాల్చి పశ్చిమ బంగాళాఖాతం తీరం సమీపంలోని సాగర్‌ దీవి, కిప్పురావు మధ్య తీరం దాటతుందని అంచనా వేసింది. ఈ తుఫాను ‘రెమల్’ అనే పేరును సూచించారు. తీరం దాటే సమయంలో పెను విధ్వంసం సృష్టిస్తుందని, తీరంలో భారీ నష్టాన్ని మిగుల్చుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాల్లోని తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణ నష్టం లేకుండా చూడాలని పేర్కొంది.


రెమల్ తుఫాను ప్రభావంతో మే 27 వరకూ పలు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, పశ్చిమ్ బెంగాల్‌‌తో పాటు ఒడిశా ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని,, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు.


రెమల్ తుఫానును ఎదుర్కొడానికి భారత తీర ప్రాంత గస్తీ దళాలు చర్యలు సిద్ధమయ్యాయి. సముద్రంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి తొమ్మిది విపత్తు సహాయక బృందాలను వ్యూహాత్మక ప్రదేశాలలో మోహరించారు. ఈ బృందాలను హల్దియా, పరాదీప్, గోపాల్‌పూర్, ఫ్రాజేర్‌గంజ్ సహా వ్యూహాత్మక ప్రాంతాల్లో అత్యవసర సహాయం కోసం మోహరించినట్టు కేంద్ర రక్షణ శాఖ చెప్పింది. ‘‘10 నౌకలు, 2 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా తూర్పు తీరం వెంబడి మోహరించిన దళాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండేందుకు పర్యవేక్షిస్తున్నాయి..ముందస్తు వారణ చర్యలు చేపట్టాం.. ఇతర ఏజెన్సీలతో సమన్వయం జరుగుతోంది.’’ అని ఇండియన్ కోస్ట్‌గార్డ్ ట్విట్టర్‌లో పేర్కొంది. ఒడిశా ప్రభుత్వం సైతం నాలుగు జిల్లాలో అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. కేంద్రపర, భద్రక్, బాలాసోర్, మయూర్బంజ్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. తుఫాను సన్నద్ధత చర్యలు చేపట్టాలని ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com