తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శనివారం (మే18)న విడుదల చేయనుంది. రేపు ఉదయం పదిగంటలకు ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవాటికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. టికెట్లు పొందాలనుకునే భక్తులు ఆన్లైన్లో ముందుగానే నమోదు చేసుకోవాలని టీటీడీ సూచించింది. నమోదు చేసుకున్న భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను కేటాయిస్తారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోసం మే 20వ తేదీ ఉదయం పది గంటల వరకూ భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. టికెట్లు పొందిన భక్తులు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లిస్తే ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో టికెట్లు మంజూరు చేస్తారు.
మే 27న నుంచి కళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు
మరోవైపు తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకూ మూడురోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య అర్థమని పండితులు చెప్తున్నారు.
మరోవైపు వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజైన మే 28వ తేదీ సాయంత్రం స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజలసేవ, రాత్రి వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ వసంతోత్సవంలో పాల్గొనాలనుకునే భక్తులు రూ.516 చెల్లించి పాల్గొనవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. వసంతోత్సవాల సందర్భంగా మే 27 నుంచి 29వ తేదీ వరకు కల్యాణోత్సవం, మే 28న స్వర్ణపుష్పార్చన, మే 29న అష్టోత్తర శతకలశాభిషేకం ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.