తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఇటు హైదరాబాద్, అటు బెజవాడలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. భాగ్యనగరంలో గంట పాటు వర్షం పడగా.. అటు విజయవాడలో మాత్రం వర్ష బీభత్సం కొనసాగుతోంది. బెజవాడలో గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్డుపై పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుకోవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి కరెంట్ లేకపోవడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. మరోవైపు నైరుతీ రుతుపవనాలు ఈ నెల 19 నాటికి అండమాన్ సముద్ర ప్రాంతానికి వస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెలాఖరికి కేరళకు, జూన్ మెదటి వారంలో ఏపికి నైరుతీ రుతుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.