‘‘నాలుగు దశాబ్దాలుగా ఎన్నికలు జరిగితే.. మా అన్న ఆనం వివేకానంద రెడ్డి లేకుండా నేను పోటీచేసిన ఎన్నికలు ఇవి’’ అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం తన ఇంటి వద్ద సమావేశ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆనం పాల్గొని ప్రసంగించారు. అధికారులు ఈ ఎన్నికల్లో తమకు సహకరించలేదని.. అధికారపార్టీకి కొమ్ముకాశారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాలు వద్ద పోలీసులు లేకుండా చేశారన్నారు. సమస్యాత్మక మండలం మర్రిపాడు మండలంలో ఒకటి నుంచి 10 పోలింగ్ కేంద్రాల్లో నాటుబాంబులు సంస్కృతి ఉన్న ప్రాంతాల్లో మహిళా కానిస్టేబులను నియమించారన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే అప్పుడు పోలీస్ అధికారులు స్పందించారని.. పోలింగ్ రోజు అధికారుల తీరు అలా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఏజెంట్లను అప్రమత్తం చేస్తే 3 వేల ఓట్లు దొంగతనంగా వేసుకోకుండా అడ్డుకున్నామన్నారు. దౌర్జన్యం , అరాచకాన్ని టీడీపీ నాయకులు అడ్డుకోగలిగారన్నారు. రేపు వచ్చే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.