వైసీపీ గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం కూటమి అభ్యర్ధి విష్టుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన విశాఖ లో మీడియాతో మాట్లాడుతూ.. కంచరపాలెం పోలీసు స్టేషన్ ఎస్ఐ.. కేసును పక్కదారిన పట్టిస్తున్నారని.. వైసీపీ గూండాలకు పోలీసు వ్యవస్థ సపోర్టు చేస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనతో పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో సీపీ మీద తప్ప వేరే ఎవరిమీద తమకు నమ్మకం లేదని.. సీపీ అపాయింట్ మెంట్ కోరామని అన్నారు. ఆయన అపాయింట్ మెంట్ వచ్చిన తర్వాత బాధితులతో కలసి వెళ్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ దాడి ఘటనలో 10 మంది ప్రమేయం ఉందని, అందర్నీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా వైసీపీ దాడిని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు.