ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శన టికెట్ల కోటా పెంపుపై టీటీడీ కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 05:24 PM

సమ్మర్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటమే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో వేసవిలో తిరుమల వెళ్లేవారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా పెంపుపై కీలక ప్రకటన చేశారు. ఆ కోటాను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం టీటీడీ డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు.


 అనంతరం మీడియాతో మాట్లాడిన ఈవో.. వేసవి రద్దీ నేపథ్యంలో వీఐపీలకు, శ్రీవాణి, టూరిజం, వర్చువల్‌ సేవలకు కేటాయించే టికెట్లను తగ్గించి ఎస్‌ఎస్‌డీ, ఎస్‌ఈడీ టికెట్ల కోటా పెంచుతామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ రానున్న నేపథ్యంలో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాల కోటా ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఈ నెల 8న గోగర్భతీర్థంలో క్షేత్ర పాలకుడికి మహా శివరాత్రి పర్వదినాన్ని, 20 నుంచి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్ని, 25న తుంబుర తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నామని చెప్పారు.


రికార్డు ఆదాయం తిరుమల శ్రీవారికి మరోసారి భారీగా ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో శ్రీవారిని 19.06 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు చెప్పారు. శ్రీవారికి హుండీ ద్వారా రూ.111.71 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. 95 లక్షల 43 వేల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించిందని వెల్లడించారు. అటు 43 లక్షల 61వేల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు. అలాగే 6.56 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com