ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఇద్దరు నేతలు పార్టీ కోసం పనిచేసినా టికెట్లు రాలేదు.. జేసీ దివాకర్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 08:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి లేదంటున్నారు మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. తనకు ఇంకా రాజకీయాలు వాసన పోలేదని.. వైఎస్సార్‌సీపీ రాక్షస పాలనను అంతమొందించి గెలుపే ధ్యేయంగా ఏకసూత్రంతోనే తెలుగుదేశం, జనసేన పొత్తుతో అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. నేతల్లో టికెట్ రాలేదనే అసంతృప్తి పాలపొంగువంటిది.. క్రమంగా తగ్గిపోతుందన్నారు.చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ధ్యేయం ఒక్కటే.. ఎలాగైనా జగన్‌ను గద్దె దింపడమేనన్నారు. చంద్రబాబు సహజ వ్యక్తిత్వానికి భిన్నంగా నిష్పక్షపాతంగా, కుల, మత, బంధు ప్రీతి లేకుండా ఆఖరుకు ఆత్మీయులను కూడా దూరం పెట్టి గెలుపు గుర్రాలకే టికెట్‌ ఇచ్చి దూకుడు ప్రదర్శించారన్నారు.


ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు కచ్చితంగా టీడీపీ గెలుస్తుందన్నారు. కళ్యాణదుర్గం ఉన్నం హనుమంతరాయ చౌదరి, బీకే పార్థసారథిలు పార్టీలో ఎంతో సీనియర్లని, పార్టీకి బాగా పని చేశారని.. ఇంకా మంచి వ్యక్తులను ఎంపిక చేయాలనే ఉద్దేశం తప్ప మరో కారణం లేదన్నారు. ఆశావహులకు టికెట్లు రాని వారితో చంద్రబాబు మాట్లాడుతున్నారని.. తాను కూడా అనంతపురం జిల్లాలో ఉన్న టికెట్ రాని వారితో మాట్లాడుతానన్నారు. ఈసారి కుల సమీకరణలు ప్రభావం చూపుతుండటంతో టికెట్లు కేటాయించాల్సి వచ్చిందన్నారు. బీజేపతో పొత్తు రావాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కలిసినప్పుడు కుటుంబానికి ఒకటే టికెట్‌ అనే మాట చెప్పలేదని, కుమారుడు జేసీ పవన్‌పై ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. పార్టీ అధిష్టానాన్ని తన సోదరుడు, తన కుమారుడు పవన్ రెడ్డి కలిసిన మాట వాస్తవమన్నారు.


చంద్రబాబు కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని.. అన్ని పార్టీల ధ్యేయం జగన్ అధికారంలోకి రాకూడదనే అన్నారు. షర్మిల తెలంగాణకు కాకుండా.. ముందే ఏపీకి వేస్తే లాభం ఉండేదన్నారు.. షర్మిల రైలు మిస్సయ్యింది అన్నారు. జగన్ పథకాలు కొన్ని బాగున్నాయని.. తాను కూడా ఒప్పుకుంటానన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలు కొనసాగిస్తూ.. కొత్త పథకాలు పెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో పరిపాలన బాగాలేదు.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. హిట్లర్ లాంటి నియంత పాలన రాష్ట్రంలో ఉంది.. అందుకే షర్మిల బయటకు వచ్చారన్నారు. టీడీపీ అభ్యర్ధుల లిస్ట్ చూసి.. అధికారపక్షం కూడా భయపడుతుంది అన్నారు. జగన్‌కు కూడా బలం ఉంది.. కానీ ప్రజలు ఆలోచనాపరులన్నారు. రాష్ట్రంలో పరిణామాలన ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం తనకు ఉందంటున్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ సిద్ధం సభలకు జనం ఇతర జిల్లాల నుంచి వస్తున్నారని.. మందు, ముక్క ఉంటేనే జగన్ సభలకు జనం వస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com