న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరానికి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరానికి అరెస్టు నుంచి కల్పించిన రక్షణను వచ్చే ఏడాది జనవరి 11 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఓపీ సైనీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నూతన సమాచారం సేకరించామని, దానిని సరిచూసేందుకు మరింత సమయం అవసరమని సీబీఐ, ఈడీ అధికారులు కోర్టుకు అందించిన నివేదికలో పేర్కొన్నారు.
ఫలితంగా చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు మంజూరైన మధ్యంతర రక్షణను పొడిగించాలని ధర్మాసనం నిర్ణయించింది. అదేవిధంగా జనవరి 11 లోపు మరికొందరు నిందితులపై కూడా సీబీఐ విచారణ జరిపేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఎయిర్సెల్- మ్యాక్సిస్ ఒప్పందం కోసం ఎఫ్ఐపీబీ అనుమతులు మంజూరు చేసే క్రమంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల మేరకు ఈ కేసు నమోదైంది.