ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ సీఎం రేవంత్‌ను చూసైనా జగన్ నేర్చుకోవాలి.. సీపీఐ నేత రామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 07:05 PM

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసైనా ఏపీ సీఎం జగన్ నేర్చుకోవాలన్నారు. రేవంత్ సీఎం కాగానే ప్రగతి భవన్ ముందు బారికేడ్లు తొలగించి ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే రూ.9 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదిక కూల్చేశారని మండిపడ్డారు. జగన్ నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రంలో విధ్వంసక పాలన చేస్తున్నారన్నారు.


జగన్ పర్యటనలన్నీ పోలీసుల మోహరింపుల మధ్య, పరదాలు, ముళ్లకంచెల మాటున సాగుతున్నాయన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు కలిసేందుకు జగన్ అనుమతించలేదని విమర్శించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికీ కూడా గత ముఖ్యమంత్రి జయలలిత పేరుతోనే పలు కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరిలో మార్పు తెచ్చుకుని, ప్రజారంజకంగా పాలన చేయాలని రామకృష్ణ హితవుపలికారు.


తెలంగాణలో జరిగిందే ఆంధ్రప్రదేశ్‌లోనూ జరగబోతోందన్నారు రామకృష్ణ. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఇది శుభపరిణామం, తెలంగాణాలో కాంగ్రెస్, సీపీఐ కలిసి పనిచేశాయన్నారు. తమ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు భారీ మెజార్టీతో గెలుపొందారని.. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణం ఉండేటట్లు చూడాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విభజన బిల్లులోని హామీలు అమలు చేయకుండా తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి రేవంత్‌రెడ్డి ముందుకు రావాలన్నారు.


రైతులు నష్టపోతున్నా సీఎం జగన్‌ ప్యాలెస్‌ వీడటం లేదని విమర్శించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని మాట్లాడితే ప్రజల కష్టాలు తీరవన్నారు. బయటకు వచ్చి పొలాల్లో తిరిగి.. రైతుల అవస్థలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. కరువుతో తీవ్ర అవస్థలు పడి పండించిన కాస్త పంటైనా చేతికి రాకుండా పోయిందని రామకృష్ణతో తుఫాన్ బాధిత రైతులు మొర పెట్టుకున్నారు.


పంట నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరికి 25వేల రూపాయలు, ఉద్యాన పంటలకు 50వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విపత్తు సంభవించి రైతులకు భారీ నష్టాన్ని కలిగించిందన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సరిగ్గా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రైతులందరూ వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రామకృష్ణ తెలిపారు. తుఫాన్ నష్టాలు, రైతుల కరువు కష్టాలు గురించి రాజకీయ పార్టీలన్నీ కలిసి సమావేశం నిర్వహించి పరిష్కారంపై చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com