ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిచౌంగ్ బీభత్సంతో చెన్నై, నెల్లూరు అస్తవ్యస్తం,,,80 ఏళ్లలో అతిపెద్ద తుఫాన్

national |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2023, 09:48 PM

మిచౌంగ్ తుఫాన్ బీభత్సం చేస్తోంది. కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైంది. చెన్నై నగరం చిగురుటాకులా వణుకుతోంది. వరదల్లో కార్లు, బైకులు, ఆటోలు కొట్టుకుపోతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న దుర్ఘటనల్లో ఇప్పటివరకూ ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గత 80 ఏళ్లలో అతిపెద్ద తుఫాన్ అని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ మరింత తీవ్ర రూపం దాల్చిందని.. డిసెంబర్ 5న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం - నెల్లూరు మధ్య నేటి అర్ధరాత్రి తర్వాత తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీస్తాయని, తుఫాన్ ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అధికారులు అప్రమత్తమయ్యారు.


అటు కేంద్రం ప్రభుత్వం కూడా అవసరమైన అన్ని చర్యలకు సహకారం అందిస్తామని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అందించే సహాయం గురించి వివరించారు. అదనపు NDRF బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. వరదల్లో చిక్కుకొని దిండిగుల్ జిల్లాలో (తమిళనాడు) ఓ వృద్ధుడు, ఓ మహిళ మృతి చెందారు. వారి వయసు వరుసగా 70 ఏళ్లు, 60 ఏళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇంటి గోడ కూలిన ఘటనల్లో మరో ముగ్గురు మృతి చెందారు.


చెన్నై సమీపంలోని పెరుంగళత్తూరు - నెడుంకుండ్రం రహదారిపై ఓ మొసలి కనిపించడం అలజడి సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడటంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఇంటర్నెట్ సేవలకూ అంతరాయం ఏర్పడింది. మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ లేకపోవడంతో వరద బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలో వాన బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా వరద నీరు చేరింది. విమానాల రాకపోకలను నిలిపివేశారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని ప్రైవేట్ కంపెనీలకు స్టాలిన్‌ ప్రభుత్వం సూచించింది. మిచౌంగ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తుఫాన్ విపత్తు నుంచి బయటపడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, వాలంటీర్లు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని అభ్యర్థించారు. ‘ఈ విపత్తును అందరం కలిసి ఎదుర్కొందాం. ప్రజలకు సాయం చేద్దాం’ అని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com