ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిజోరాం ఎన్నికల్లో అధికార ఎంఎన్‌ఎఫ్‌కి పరాభవం,,,,,బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను దూరంపెట్టిన ప్రజలు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2023, 09:49 PM

ఈశాన్య రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలున్న మిజోరాంలో ఆ పార్టీ 27 స్థానాల్లో గెలుపొందింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ కేవలం 10 సీట్లకే పరిమితమైంది. ఐదేళ్ల కిందట వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవడం గమనార్హం. 2018 వరకూ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్‌ల మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. 1989 నుంచి అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కట్టే ఆనవాయితీ కొనసాగుతుండగా.. ఈసారి మాత్రం ఓటర్లు మార్పు కోరుకున్నారు.


వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న ఎంఎన్‌ఎఫ్‌కి జెడ్‌పీఎం షాక్ ఇచ్చింది. ఐజ్వాల్ ఈస్ట్-1 నుంచి బరిలో నిలిచిన ముఖ్యమంత్రి, ఎంఎన్ఎఫ్ చీఫ్ జోరాంతంగ ఓటమి చవిచూడగా.. ఆయన క్యాబినెట్‌లోని పలువురు మంత్రులు ఓడిపోయారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా అక్కడ నవంబర్ 7న పోలింగ్ పూర్తికాగా.. 80 శాతానికి పైగానే ఓటింగ్ నమోదయ్యింది. మిగతా నాలుగు రాష్ట్రాలతో పాటు ఆదివారమే మిజోరాంలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. క్రైస్తవులు అధికంగా ఉన్న మిజోరాంలో ఆదివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి.. కౌంటింగ్ తేదీ మార్చాలని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు కోరాయి. దాంతో ఎలక్షన్ కమిషన్ సోమవారానికి వాయిదా వేసింది


మాజీ ఐపీఎస్ అధికారి లాల్దుహోమా నేతృత్వంలో జడ్పీఎం.. 1987లో మిజోరాం రాష్ట్ర హోదా పొందినప్పటి నుంచి అధికారంలో ఉన్న ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ వైఫల్యాలతో ప్రజలు విసిగిపోయారని, తాము అధికారంలోకి వస్తే మార్పును తీసుకొస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ‘మార్పు కోరుకునే మిజోరాం యువకులు మాకు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో భాగమైనందున ఎంఎన్‌ఎఫ్‌కి వ్యతిరేకంగా కూడా ఓటు వేశారు. క్రైస్తవులు మెజారిటీగా ఉన్న మిజోరాలో బీజేపీని ముప్పుగా చూస్తారు’ అని ఫలితాల తర్వాత జెడ్‌పీఎం నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీని నడిపిస్తున్న 74 ఏళ్ల లాల్ దహోమా మాజీ ఐపీఎస్, గోవాలో కెరీర్ ప్రారంభించిన దహోమా.. నాటి ప్రధాని ఇందిరా గాంధీ భద్రతా ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీవిరమణ చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 1984 ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టంపై డిశ్చార్జ్ అయిన మొదటి ఎంపీగా నిలిచారు. 2017లో జోరం నేషనలిస్ట్ పార్టీ స్థాపించి.. జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌ కూటమిలో చేరారు. 2018 ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీచేయగా... విజయం మాత్రం ఎంఎన్‌ఎఫ్‌ను వరించింది. ప్రస్తుత ఎన్నికల్లో తన పార్టీని అధికారం దిశగా నడిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com