ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారంతా దర్జాగా వైసీపీలోకి వెళ్లిపోవచ్చు.. పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 02, 2023, 08:14 PM

టీడీపీ, జనసేన పార్టీల పొత్తుపై పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తుకు వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా.. చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు. అలాంటివారిని వైఎస్సార్‌సీపీ కోవర్టులుగా భావిస్తానని.. గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకో, పవన్‌ కల్యాణ్‌కో తూట్లు పొడిచినట్లు కాదన్నారు. ఏ ప్రజల కోసం నిలబడాలనుకుంటున్నామో దానికి తూట్లు పొడుస్తున్నట్లన్నారు. అందుకే అలాంటి చర్యలను సహించేది లేదన్నారు. ఆషామాషీగా ఈ పొత్తు నిర్ణయం తీసుకోలేదన్నారు.


తాను ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకుంటానని.. ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ మంచి జరిగేలా, రాష్ట్రానికి మేలు చేసేలా, తెలుగు ప్రజలకు అండగా ఉండేలా నిర్ణయం తీసుకుంటాడని సంపూర్ణంగా నమ్మితే సందేహించరన్నారు. తన నిర్ణయాలను సందేహించేవారు వైఎస్సార్‌సీపీ వెళ్లిపోవచ్చన్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా సీరియస్‌గా తీసుకుంటానన్నారు. తాను మొండి వ్యక్తిని, భావజాలాన్ని నమ్మినవాడిని అన్నారు. రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ బతిమాలరన్నారు. బీజేపీ నేతలు వచ్చి తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకున్నారంటే వాళ్లు తగ్గారని కాదన్నారు. పార్టీ అవసరాన్ని గుర్తించారని తెలుసుకోవాలన్నారు. రాజకీయ ప్రక్రియలో ఎవరినైనా గౌరవించాలని.. టీడీపీతో పొత్తులోనూ అదే సూత్రం వర్తిస్తుందన్నారు. టీడీపీని తగ్గించేలా జనసేన నేతలు ఎవరూ మాట్లాడినా సహించేది లేదన్నారు.


జగన్‌ లక్ష కోట్లు దోచేసిన దోపీడీదారుడు.. ఆయన దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం అన్నారు.పదేళ్ల పాటు జగన్‌ రాజకీయాల వైపు చూడకుండా జనసేన ప్రయత్నిస్తుందన్నారు. ఆ తర్వాత ఆయన మారి ఆయనలోని విషం తగ్గితే అప్పుడు వేరే విషయమన్నారు. ఎందుకు ఒంటరిగా పోటీ చేయరని తనను జగన్‌ పదే పదే ప్రశ్నిస్తుంటారని.. ఆయన ఒక మహానుభావుడై ఉంటే అలా ఒంటరిగా పోటీ చేసేవాళ్లమని, ఆయనొక ప్రజాకంటకుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులాన్ని మోసం చేస్తున్నానంటూ వైఎస్సార్‌సీపీ వాళ్లు ప్రచారం చేస్తున్నారని.. ఒకే ఒక కులాభిమానంతో రాజకీయ ప్రస్థానం సాధ్యం కాదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రయోగించే కులం ట్రాప్‌లో నాయకులు ఎవరూ పడొద్దన్నారు.


డిసెంబరు 9, 10 తేదీల నుంచి మంగళగిరి కార్యాలయం.. లేని పక్షంలో రాజమహేంద్రవరంలో నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్‌లు, కీలక నాయకులతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటానన్నారు. తన వద్ద కూడా రిపోర్టులు, డేటా ఉన్నాయని, అక్కడి నాయకుల పనితీరు తెలుసున్నారు. లోకేశ్‌ యువగళం కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ జనసేన శ్రేణులు కలిసి వెళ్లాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com