ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ తీర్పును తెలుగులోకి మార్చి పోలీసులకు పంపండి.. డీజీపీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 08:44 PM

పోలీసులు కేసుల నమోదు విషయం లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని పోలీసుల కు హైకోర్టు తేల్చిచెప్పింది. లలితకుమారి వర్సెస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని రాష్ట్రంలోని పోలీసు అధికారులకు మరోసారి పంపాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అందరికీ అర్థమయ్యేలా తీర్పును తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయాలని సూచించింది. తీర్పులోని అంశాలపై పూర్తి అవగాహన చేసుకొని.. వాటిని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా చూడాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఆదేశించారు.


పోలీసులకు పౌరుల నుంచి అందిన ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ అవసరమని భావించి.. 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నారు. ఒకవేళ చేయకపోతే.. సదరు ఫిర్యాదుపై విచారణ ఏ దశలో ఉందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుకు అందించేలా చూడాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే జిల్లా ఎస్పీకి పోస్టు ద్వారా రాతపూర్వకంగా సమాచారం ఇవ్వొచ్చనీ తెలిపింది. అప్పటికీ నమోదు చేయకపోతే ఆయా పరిధిలోని మెజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేయవచ్చని తెలిపింది.


పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై హైకోర్టులో ఇటీవల పలు వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. దీంతో లలితకుమారి కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మరోసారి పోలీసు అధికారులకు పంపించి.. ఆ ప్రకారం నడుచుకునేలా చూడాలని రాష్ట్ర డీజీపీని ఆదేశిస్తున్నట్లు జడ్జి తెలిపారు. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం పిటిషనర్లు తగిన ఫోరాన్ని ఆశ్రయించేందుకు స్వేచ్ఛనిచ్చింది.


విశాఖపట్నంలోని మహారాణిపేట పోలీసులకు తాను ఫిర్యాదు చేసినా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కె.రామారావు హైకోర్టును ఆశ్రయించారు. మరో పీఎస్‌లోనూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది. ఈ రెండింటిపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున లాయర్ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. పలు తీర్పులను ఉదహరించడంతో కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకుంది. కాగ్నిజబుల్‌ నేరాలు చోటుచేసుకున్నప్పుడు ప్రాథమిక విచారణ అవసరం లేకుండానే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి ఉంటుందని తదితర అంశాలపై స్పష్టత ఇస్తూ లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తుచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com