ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొన్న వైసీపీకి రాజీనామా.. ఇవాళ లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 06:52 PM

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన ఎంపీపీలు, ఎంపీటీసీ, సర్పంచ్‌లు ఇవాళ టీడీపీలో చేరారు. శనివారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. ఆ తర్వాత యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ను కలిసి టీడీపీ కండువాలు కప్పుకున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటుగా పలువురు సీనియర్ నేతలు టీడీపీలో చేరారు. వీరిలో ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, రౌతులపూడి ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మీ, భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జీ, తూర్పులక్ష్మీపురం సర్పంచ్ వీరంరెడ్డి సత్యనాగభార్గవితో పలువురు ఉన్నారు.


పేరూరు విడిది కేంద్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి లోకేష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాడులో ఈసారి టీడీపీ భారీ మెజార్టీతో గెలవాలని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వ విధానాలు తమకు నచ్చడం లేదని.. ప్రత్తిపాడులో ఈసారి టీడీపీ గెలుపు ఖాయమని పార్టీలో చేరిన నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా, నియోజకవర్గం ముఖ్య నేతలు పాల్గొన్నారు.


కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఎంపీపీలు సహా నలుగురు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, రౌతులపూడి ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మి, ఏలేశ్వరం మండలం భద్రవరం ఎంపీటీసీ సభ్యుడు కొప్పుల బాబ్జీ, తూర్పులక్ష్మీపురం సర్పంచి వీరంరెడ్డి సత్యరాణినాగభార్గవిలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాము ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పటి నుంచి సొంతపార్టీకి చెందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ తమపై వేధింపులకు దిగారని ఆరోపించారు.


తన అనుచరులతో సమాంతర పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన మహిళనైన తనను ఎమ్మెల్యే అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు ఎంపీపీ రాజ్యలక్ష్మి . తమ కుటుంబంపై దాడి చేయించి, తిరిగి తమపైనే కేసులు నమోదు చేయించారన్నారు. తమను హత్య చేయించాలని చూశారని అని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సాధికారత ఎక్కడుందో చూపించాలని ప్రశ్నించారు.


పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వీరంతా తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. వారికి టీడీపీలోకి ఆహ్వానించేందుకు ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభరాజా, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు వెళ్లారు. రాష్ట్రం, నియోజకవర్గంలో ను రాష్ట్రంలో అరాచక, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఇందుకు నలుగురు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరాలని కోరారు. పార్టీలో చేరతామని ప్రజాప్రతినిధులు తెలిపారు.. ఇవాళ పార్టీలో చేరిపోయారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com