ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఉజైర్ ఖాన్ హతం,,,, ముగిసిన సైన్యం ఆపరేషన్,,,అమరులైన అధికారులు సహా నలుగురు భద్రతా సిబ్బంది

national |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 09:35 PM

అనంత్‌నాగ్ జిల్లా కొకెర్‌నాగ్ ప్రాంతంలో గత మంగళవారం సాయంత్రం మొదలైన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ఏడు రోజుల తర్వాత ముగిసింది. వారం రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సైనికాధికారులు, ఓ పోలీస్ అధికారి సహా నలుగురు అమరులయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా కమాంట్ ఉజైర్ ఖాన్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు జమ్మూ కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ముష్కరుల ఎదురు కాల్పుల్లో నలుగురు భద్రతా అధికారులు నేలకొరిగారని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ ముగిసినా.. ఆ ప్రాంతంలో సెర్చింగ్ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.


‘ఇప్పటి వరకూ లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ మృతదేహం స్వాధీనం చేసుకున్నాం.. మరో ఉగ్రవాది మృతదేహం కూడా కంటపడింది.. కానీ, ఆ మృతదేహం ఇంకా స్వాధీనం చేసుకోలేదు’ అని అనంత్‌నాగ్‌లో మీడియాతో ఏడీజీపీ అన్నారు. దక్షిణ కశ్మీర్ జిల్లా అనంత్‌నాగ్ గడోల్ అటవీ ప్రాంతంలో గత బుధవారం ప్రారంభమైన ఎన్‌కౌంటర్ ముగిసింది కానీ, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది అని ఆయన చెప్పారు.


‘సెర్చ్ ఆపరేషన్ చేపట్టాల్సిన ప్రాంతం చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది.. పేలని మందుగుండు, షెల్స్ చాలా ఉండొచ్చు.. వాటిని నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది.. ఆ ప్రాంతానికి వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులు అక్కడ ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం ఉందని ఏడీజీపీ తెలిపారు. ‘మూడో మృతదేహం ఎక్కడో ఉండే అవకాశం ఉంది.. సెర్చ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత తెలుస్తుంది’ అని విజయ్ కుమార్ చెప్పారు.


కాగా, బుధవారం ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 19 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్‌ అశోక్ ధోనక్, కశ్మీరీ పోలీసు డీఎస్పీ హుమయూన్ భట్, ఆర్మీ జవాన్ ప్రదీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జవాన్ ప్రదీప్ మృతదేహం సోమవారం సాయంత్రం (సెప్టెంబరు 18న) లభ్యమైంది.


ప్రస్తుతం ఎన్‌కౌంటర్ పీర్‌పంజాల్‌ పర్వత శ్రేణుల్లో జరిగింది. ఈ పర్వత శ్రేణులు ఉన్న పూంచ్‌, రాజౌరీల్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు బాగా పెరిగాయి. పాక్‌ సరిహద్దు దాటుకొని ఇక్కడకు చేరుకునే ఉగ్రవాదులు.. శ్రీనగర్‌ లేదా డోడా వెళ్లాలన్నా అనంతనాగ్‌ మీదుగానే ప్రయాణించాలి. దీంతో ముష్కర మూకలకు ఇది కీలక స్థావరంగా మారింది. కశ్మీర్‌లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పీర్‌ పంజాల్‌ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి.


ఇక్కడున్న బనిహాల్‌, హాజిపీర్‌, పీర్‌పంజాల్‌ కనుమలు అత్యంత కీలకమైనవి. ఇక్కడి దాదాపు 15 వేల అడుగుల ఎత్తుండే ఈ పర్వతశ్రేణుల భౌగోళిక స్వరూపం సైనిక అపరేషన్లకు ఏ మాత్రం అనుకూలించదు. దీనికి తోడు దట్టమైన అడవులు ఉండటం.. ఎంత పెద్ద దళానికైనా సవాలే. ఇదే ఉగ్రవాదులకు అనుకూలంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com