ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ దేశాల్లో వినాయకుడిని ఏమని పిలుస్తారు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 09:34 PM

మనం ఏ శుభ కార్యం చేసినా మొదట గణపతి పూజ చేస్తాం. అది ఆనవాయితీ. సాధారణంగా ఇళ్లలో జరుపుకునే నోముల దగ్గరి నుంచి వైదిక యాగాల వరకు వినాయ‌కుడికి పూజ చేసిన తర్వాతే మిగితా పూజలు ప్రారంభిస్తారు. ఇక వినాయక చవితికి అయితే గణేశ్ నవరాత్రోత్సవాలను అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటాం. 9 రోజుల పాటు రోజుకో రకమైన పిండి వంటకాలు నైవేద్యంగా పెడుతారు. ఇక మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారు, అక్కడ ఉండే వారు కూడా గణపతిని పూజిస్తూ ఉంటారు. అందుకే అనేక దేశాల్లో వినాయకుడి ఆలయాలు నిర్మించి ఘనంగా పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో దేశంలో విఘ్నేశ్వరుడిని ఒక్కో రకమైన పేరుతో పిలుస్తారు. అయితే అందులో కొన్ని దేశాలు, ఆ దేశాల్లో వినాయకుడిని ఏ పేర్లతో పిలుస్తారు అనే విషయాలు తెలుసుకుందాం.


ఇండోనేషియాలోని గణేశ్ చాలా ఫేమస్. బాలి దీవిలో చాలా వినాయకుడి గుళ్లు ఉన్నాయి. స్కూళ్లు, భవనాల నిర్మాణాల్లోనూ గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఇండోనేషియా కరెన్సీపై కూడా గణపతి బొమ్మ ముద్రించి ఉంటాయి. బాలీలో 30 అడుగుల ఎత్తు గల వినాయక విగ్రహన్ని 2006 లో ప్రతిష్ఠించారు. మన దేశంలో ఉన్నట్లుగానే ఇండోనేషియాలోనూ గణేశ్ నిమజ్జనం జరుపుతారు. నిమజ్జనంలో భక్తులు కొట్టిన కొబ్బరి కాయలను తొలగించడానికి ఒక రోజంతా పడుతుందంటే ఎంత మంది జనం వస్తారో ఊహించుకోవచ్చు. ఆ విగ్రహం చుట్టూ 204 దేశాల జెండాలను ఏర్పాటు చేస్తారు.


బెర్లిన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆధ్యాత్మిక యాత్రల్లో భాగంగా ఆసియాలో పర్యటించినపుడు వినాయకుడి భక్తుడిగా మారాడు. తమిళనాడుకు చెందిన శిల్పులతో వినాయకుడి విగ్రహాలను చెక్కించి ఐర్లాండ్‌లోని కౌంటీ విక్లోకు సమీపంలోని ‘విక్టోరియా వే’ పార్కులో ఏర్పాటు చేశాడు. ఆ విగ్రహాలను తయారు చేయించేందుకు గ్రానైట్‌ శిలను వినియోగించారు. ఒక్కో శిల్పాన్ని చెక్కడానికి ఐదుగురు శిల్పుల చొప్పున ఏడాదిపాటు చెక్కించారు. ఒక్కో విగ్రహం 3 నుంచి 5 అడుగుల వరకు ఎత్తు ఉన్నాయి.


జపాన్‌లో వినాయకుడిని కాంగిటెన్‌ అని అక్కడి వారు పిలుచుకుంటారు. ఈ కాంగిటెన్ మాత్రమే కాకుండా షాటెన్‌, గణాబాచి, బినాయకటెన్‌ ఇలా రకరకాల పేర్లతో ఆ విఘ్నేశ్వరుడిని పిలుస్తారు. జపాన్ రాజధాని టోక్యోలోని అతి పురాతన బౌద్ధ ఆలయాల్లో కాంగిటెన్‌ ఆలయం కూడా దర్శనం ఇస్తుంది. కొన్ని కాంగిటెన్ ఆలయాల్లో ఆడ ఏనుగును ఆలింగనం చేసుకున్న రూపంలోనూ వినాయకుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వినాయకుడి విగ్రహాలను పెట్టెల్లో ఉంచి.. ఉత్సవాల సమయంలో బయటికి తీసి పూజలు చేస్తూ ఉంటారు. ఆర్థికంగా వృద్ధి చెందే దేవుడిగా జపాన్ వాసులు వినాయకుడికి పూజలు చేస్తారు.


వినాయకుడు అంటే శివపార్వతుల కుమారుడిగా మన దేశంలో పూజిస్తారు. కానీ మయన్మార్‌లో మాత్రం విఘ్నేశ్వరుడిని బ్రహ్మగా కొలుస్తారు. అలా పిలవడం వెనక ఒక పాత కథ కూడా ప్రచారంలో ఉన్నట్లు చెబుతారు. బ్రహ్మదేవుడి శిరస్సు భంగం అయినప్పుడు.. ఏనుగు తలను అతికించారనీ.. అలా బ్రహ్మ దేవుడు కాస్తా గజాననుడిగా మారాడని విశ్వసిస్తారు. ఇప్పటికీ మయన్మార్‌లో వినాయక చవితికి గణపతిని పరబ్రహ్మగా పూజిస్తూ ఉంటారు.


నేపాల్‌లో ఎన్నో హిందూ దేవుళ్ల ఆలయాలు ఉన్నాయి. అందులో గణపతి దేవాలయాలు కూడా ఎక్కువే ఉంటాయి. అక్కడి వారు ఎక్కువగా విఘ్నేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు. అయితే నేపాల్‌లో ఉండే గుళ్లలో ఉండే గణపతి విగ్రహాలు మిగితా విగ్రహాల కంటే భిన్నంగా ఉంటాయి. ఏటవాలు కళ్లు కలిగి ఉండి ఆ విగ్రహం చేతుల్లో మొక్కలు ఉంటాయి. అక్కడ ఉండే నేచర్ లవర్స్ గణపతిని పంటల దేవుడిగా పూజిస్తారు.


సింగపూర్‌లో అత్యంత ప్రాచీనమైన వినాయకుడి ఆలయం ఉంది. ఇక్కడ గణనాథుడి దేవాలయాన్ని శ్రీ సెంపెగ వినాయగర్ అని పిలుస్తారు. సిలాన్‌ రోడ్డులో శ్రీ సెంపెగ వినాయగర్‌ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. చోళ రాజుల నిర్మాణ శైలిలో నిర్మితమైన శ్రీ సెంపెగ వినాయగర్ ఆలయానికి 162 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com