న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వారితో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టెక్నాలజీ ద్వారా ప్రజలు మరింత లాభం పొందాలన్న ఉద్దేశంతోనే డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. డిజిటల్ ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విప్లవం వచ్చిందన్నారు. టెక్నాలజీ అందుబాటు వల్లే రైల్వే టికెట్లను ఈజీగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నామని, బిల్లులు కూడా ఆన్లైన్లో కడుతున్నామని ప్రధాని చెప్పారు. ఆన్లైన్ వెసలుబాటు అందరికీ కలిసి వస్తోందన్నారు. టెక్నాలజీ ఉపయోగాలు కొందరి కోసమే కాదని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు లాభాలు చేకూరుతాయన్నారు. సీఎస్సీ నెట్వర్క్ను మరింత పటిష్టం చేశామని మోదీ చెప్పారు. దళారీ వ్యవస్థను రూపుమాపాలన్న ఉద్దేశంతోనే డిటిజల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిజిటల్ ఇండియా వల్ల బీపీవో రంగంలో మార్పులు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ర్టాల్లో బీపీవో రంగం కొత్త అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఈ సందర్భంగా కోహిమా, నాగాలాండ్కు చెందిన బీపీవో ఉద్యోగులు ప్రధానితో మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా వల్ల ఉత్పత్తి రంగంలోనూ ప్రగతి సాధించామన్నారు. దీని వల్ల యువకులకు అనేక రంగాల్లో పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. డిజిటల్ సాధికారతతో పాటు సాంకేతిక విప్లవం ద్వారా సృజనాత్మకతను పెంపొందించాలని భావిస్తున్నట్లు ప్రధాని చెప్పారు.